Sejal Sharma: హిందీ టీవీ సీరియల్స్ నటి సెజల్ శర్మ ఆత్మహత్య

  • నిన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సెజల్ శర్మ
  • భౌతికకాయాన్ని ఉదయ్ పూర్ కు తరలిస్తున్న కుటుంబ సభ్యులు
  • పలు కమర్షియల్స్ లో కూడా నటించిన సెజల్

హిందీ టీవీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న యువ నటి సెజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న ఈ దారుణానికి ఒడిగట్టింది. 'దిల్ తో హ్యాపీ హై జీ' సీరియల్ లో సిమ్మీ ఖోస్లా పాత్రను పోషించిన ఆమె... ప్రేక్షకుల హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది.

ఈ నేపథ్యంలో ఆ సీరియల్ లో ఆమె కోస్టార్ అయిన అరువర్మ మాట్లాడుతూ, సెజల్ మరణవార్తను విని షాక్ కు గురయ్యానని అన్నాడు. 10 రోజుల క్రితమే ఆమెను కలిశానని, ఆదివారం నాడు వాట్సాప్ లో చాట్ చేశానని చెప్పాడు. ఆమె మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపాడు. ఆమె చాలా సంతోషంగా ఉండేదని.. ఇలా ఎందుకు చేసుకుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

సెజల్ ఆత్మహత్య చేసుకుందనే విషయం ఆమె కుటుంబానికి ఈ ఉదయమే తెలిసిందని... కానీ, నిన్న రాత్రే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అరువర్మ అన్నాడు. అంత్యక్రియల కోసం ఆమె భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు ఉదయ్ పూర్ కి తరలిస్తున్నారని చెప్పాడు.

యాక్టింగ్ కెరీర్ కోసం 2017లో ఉదయ్ పూర్ నుంచి ముంబైకి సెజల్ వచ్చింది. స్టార్ ప్లస్ లో ప్రసారమవుతున్న 'దిల్ తో హ్యాపీ హై జీ' షోతో ఆమె నటన రంగంలోకి అడుగుపెట్టింది. పలు కమర్షియల్స్ లో కూడా కనిపించింది. 'ఆజాద్ పరిందే' వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.

More Telugu News