Crime News: మాయ'లేడి'... భర్తను హత్య చేయించి స్నేహితుడు చంపాడని కట్టుకథ!

  • ప్రియుడిపై ఒత్తిడి తెచ్చి భర్తపై అఘాయిత్యం
  • అనంతరం అతని పైనే ఫిర్యాదు
  • విచారణలో అసలు గుట్టు బయట పెట్టిన పోలీసులు

ఒక ఎపిసోడ్ లో ఎన్ని మలుపులు ఉండాలో అన్ని మలుపులు ఈ సంఘటనలో కనిపిస్తాయి. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అతని సాయంతో మొగుడి అడ్డు తొలగించుకోవడమేకాక తిరిగి ప్రియుడే చంపాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో వాస్తవాలు రాబట్టిన పోలీసులు నిందితులు ఇద్దరినీ కటకటాల వెనక్కి పంపారు.

పోలీసుల కథనం మేరకు... మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడకు చెందిన ముక్కుట యాదాగౌడ్ (35), సౌజన్య దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. ఐదేళ్ల క్రితం వీరు హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు.

ప్రైవేటు ఉద్యోగి అయిన యాదాగౌడ్ కు డీసీఎం డ్రైవర్ షేక్ ఆసీఫ్ తో స్నేహం ఉండేది. దీంతో తరచూ యాదాగౌడ్ ఇంటికి వచ్చే ఆసీఫ్, సౌజన్య మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం భర్తకు తెలిసి మందలించినా సౌజన్య పట్టించుకోలేదు. పైగా భర్త తనను హింసిస్తున్నాడని, అతని అడ్డు తొలగిపోతే మనం సంతోషంగా ఉండొచ్చంటూ ప్రియుడికి నూరిపోసింది.

దీంతో యాదాగౌడ్ ను చంపేయాలని నిర్ణయించుకున్న ఆసిఫ్ ఈనెల 15న అతని వద్దకు వచ్చి పార్టీ ఉందంటూ చర్చిగాగిల్లాపూర్‌లోని డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్దకు తీసుకువెళ్లాడు. అతనితో ఫుల్ గా మద్యం తాగించి అనంతరం కత్తితో హత్య చేశాడు. తర్వాత యాదాగౌడ్ ఇంటికి వచ్చి సౌజన్యకు విషయం చెప్పి వెళ్లిపోయాడు.

వెంటనే ప్లేట్ ఫిరాయించిన సౌజన్య తన భర్తను ఆసిఫ్ చంపేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ కొత్త మలుపు తిరిగింది. విచారణలో పోలీసులకు ఆసిఫ్ జరిగినదంతా చెప్పడంతో వారు ఆసిఫ్, సౌజన్య కాల్ రికార్డును పరిశీలించారు. దానిలో సౌజన్య ప్రోద్బలంతోనే ఆసిఫ్ హత్యచేశాడని నిర్ధారణ కావడంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. తండ్రి హత్యకు గురికావడం, తల్లి జైలుకెళ్లడంతో పిల్లలు అనాథలుగా మారారు.

More Telugu News