Ongole: ఒంగోలులో దారుణం.. వివాహితపై ఆటోలో ప్రయాణికుడు సహా ముగ్గురు అత్యాచారం!

  • ప్రయాణికుడిని దోచుకోవాలని డ్రైవర్ ప్లాన్
  • స్నేహితుడికి ఫోన్ చేసి సిద్ధంగా ఉండమన్న డ్రైవర్
  • మార్గమధ్యంలో వివాహితను ఎక్కించుకుని దారుణం

ఒంగోలులో దారుణం జరిగింది. ఆటో ఎక్కిన వివాహితపై ప్రయాణికుడు సహా డ్రైవర్, అతడి స్నేహితుడు అఘాయిత్యానికి తెగబడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో చీమకుర్తికి చెందిన ఓ వ్యక్తి ఆటో ఎక్కాడు. అతడు పూర్తిగా మద్యం మత్తులో ఉండడంతో అతడి దగ్గర ఉన్న సొత్తును దోచుకోవాలని ఆటో డ్రైవర్ ప్లాన్ చేశాడు.

ప్రయాణికుడితో కలసి కేశవరాజుకుంటవైపు బయలుదేరిన డ్రైవర్.. తన మిత్రుడికి ఫోన్ చేసి విషయం చెప్పి దారిలో సిద్ధంగా ఉండమన్నాడు. దారిలో తనకు పరిచయం ఉన్న వివాహిత కనబడడంతో ఆమెను కూడా ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత మిత్రుడిని కూడా ఎక్కించుకుని చినమల్లేశ్వర కాలనీ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు.

అనంతరం ఆటోలో ఉన్న వివాహితపై ప్రయాణికుడు సహా అందరూ అత్యాచారం చేశారు. బాధితురాలు అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమె వివస్త్రగా ఉండగానే బయటకు లాగి పడేశారు. ఈ క్రమంలో ఆమె తలకు తీవ్ర గాయమైంది.

అనంతరం బాధితురాలి వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకున్న డ్రైవర్.. అందులోని సిమ్‌ను తీసి పడేసి, తన సిమ్ వేసుకున్నాడు. తర్వాత ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ ఘటనకు ముందు ఆమెతో ఫోన్లో మాట్లాడిన నలుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

More Telugu News