ZEE Awards: జీ సినీ అవార్డ్స్: ఉత్తమ నటుడిగా మెగా స్టార్ చిరంజీవి.. ఉత్తమ నటిగా సమంత

  • కళా తపస్వి కె.విశ్వనాథ్ కు జీవిత సాఫల్య పురస్కారం
  • మహేశ్ బాబుకు ట్విట్టర్ స్టార్ అవార్డు  
  • వినోదాన్ని పంచిన అవార్డుల ప్రదానోత్సవం

జీ తెలుగు-2020 సినీ అవార్డుల్లో ఉత్తమ నటీనటులుగా సమంత, మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. మనసులను రంజింపచేసే సీరియల్స్, ఆకట్టుకునే రియాలిటీ షోస్, సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకున్న జీ తెలుగు ఛానెల్ ఈ ఏడాదికిగాను జీ తెలుగు, జీ సినీ అవార్డులను ప్రదానం చేసింది. కన్నుల పండువగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి సెలబ్రిటీలు పోటెత్తారు. అద్భుతమైన వినోదాన్ని పంచుతూ సాగిన కార్యక్రమం నృత్యాలు, వ్యాఖ్యానాలతో అలరించింంది. ప్రదీప్, రవి, శ్యామల తమదైన శైలిలో యాంకరింగ్ తో ప్రేక్షకులను ఉర్రూత లూగించారు.  నిధి అగర్వాల్, మెహ్రీన్, హాట్ యాంకర్ అనసూయ తమ డ్యాన్సులతో అదరగొట్టారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయనతోపాటు కార్యక్రమానికి హాజరైన సినీ తారల్లో జయప్రద, రామ్, సమంత, కార్తికేయ, పూజా హెగ్డే, చార్మీకౌర్, రెజీనా, నీల్ నితిన్ ముకేశ్, ఖుష్బూ, శ్రద్ధా శ్రీనాథ్, అల్లరి నరేష్, శివాత్మిక రాజశేఖర్, ఆనంద్ దేవరకొండ.. తదితర సెలబ్రెటీలు ఉన్నారు‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటనకుగాను  చిరంజీవి ఉత్తమ నటుడు అవార్డు అందుకోగా, ‘మజిలీ’ ‘ఓ బేబి’ సినిమాలో నటనకుగాను సమంత ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. హీరో మహేశ్ బాబు ట్విట్టర్ స్టార్ గా అవార్డును అందుకోవడం కొసమెరుపు.  ఈ కార్యక్రమాన్ని జీ సంస్థ ఈ నెల 25, 26 తేదీల్లో సాయంత్రం 6 గంటల నుంచి  జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ చానెల్స్‌లో ప్రసారం చేయనుంది..

More Telugu News