New Delhi: ఢిల్లీలో మినీ పాకిస్థాన్ లు ఉన్నాయన్న బీజేపీ నేత కపిల్ మిశ్రాకు ఈసీ షోకాజ్ నోటీసులు

  • సీఏఏపై నిరసనలు వస్తోన్న ప్రాంతాలే మినీ పాకిస్థాన్ లు
  • అక్కడ పరిస్థితులు పాకిస్థాన్ ను తలపిస్తున్నాయి
  • ఈ నేపథ్యంలో ట్వీట్ చేశానన్న మిశ్రా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేత కపిల్ మిశ్రా చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీని పాకిస్థాన్ గా, బీజేపీని భారత్ గా పేర్కొంటూ.. ఫిబ్రవరి 8న ఢిల్లీలో ‘భారత్-పాకిస్థాన్ మధ్య మహా సంగ్రామం జరుగనుంది’ అని ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఆయనకు ఎన్నికల కోడ్ లోని క్లాజ్ 1(1) కింద షోకాజ్ నోటీసులు జారీచేసింది. అదేవిధంగా కపిల్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను తొలగించాలని ట్విట్టర్ నిర్వాహకులను ఆదేశించింది. ఇదిలావుండగా, తమ పార్టీని పాకిస్థాన్ తో పోల్చడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ  నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ వ్యాఖ్యలకు నేను కట్టుబడే ఉన్నా: కపిల్ మిశ్రా

ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న ప్రాంతాలను మినీ పాకిస్థాన్ గా పేర్కొన్నానని మిశ్రా చెప్పారు. ఢిల్లీలో మినీ పాకిస్థాన్ ను సృష్టించారన్నారు. అక్కడ రోడ్లను బ్లాక్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో.. రానున్న ఎన్నికల్లో ఢిల్లీ వీధుల్లో భారత్ -పాకిస్థాన్ మధ్య పోటీ జరుగుతోందని చెప్పానన్నారు. ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఈసీకి తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రా మోడల్ టౌన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.

More Telugu News