India: చిచ్చరపిడుగులా చెలరేగిన అయ్యర్... కివీస్ తో తొలి టి20లో టీమిండియాదే విజయం

  • 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా
  • మరో ఓవర్ మిగిలుండగానే పని పూర్తి
  • 5 ఫోర్లు, 3 సిక్సులు బాదిన అయ్యర్
  • కేఎల్ రాహుల్ ఫిఫ్టీ, రాణించిన కోహ్లీ

సుదీర్ఘమైన న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా విజయంతో శుభారంభం చేసింది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ మైదానంలో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఆతిథ్యజట్టును చిత్తు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్ విధ్వంసకర బ్యాటింగ్ తో కివీస్ ఆశలపై నీళ్లు చల్లాడు.

 204 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 142 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా, శ్రేయాస్ అయ్యర్ మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. విన్నింగ్ షాట్ గా ఓ సిక్సర్ బాది మ్యాచ్ ను ముగించాడు. ఈ ముంబై బ్యాట్స్ మన్ కేవలం 29 బంతులాడి 5 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఓపెనర్ కేఎల్ రాహుల్ 56 పరుగులు చేయగా, కెప్టెన్ కోహ్లీ 45 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన కివీస్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేయగా, భారత్ ఆ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. ఇక, ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఇదే మైదానంలో జనవరి 26 ఆదివారం జరగనుంది.

More Telugu News