Mangalore Bomb case: వ్యవస్థను బాగు చేయాలనే విమానాశ్రయంలో బాంబు పెట్టా!: మంగళూరు నిందితుడు

  • డబ్బులేక తనను ఎవరూ గౌరవించడం లేదు
  • ప్రతీకారం తోనే బాంబు పెట్టా
  • కానీ  పెట్టాక తప్పు చేశాననిపించి లొంగిపోయా

సమాజంలో ఏ వ్యవస్థ సక్రమంగా లేదని, ఈ వ్యవస్థను బాగు చేయాలన్న ఉద్దేశంతోనే తాను విమానాశ్రయంలో బాంబు పెట్టానని మంగళూరు నిందితుడు చెపుతున్నాడు. మంగళూరు విమానాశ్రయంలో సోమవారం బ్యాగులో ఉన్న బాంబును నిఘా అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ బాంబు పెట్టిన ఆదిత్యరావు అనే వ్యక్తి అనంతరం బెంగళూరు వెళ్లి పోలీసుల వద్ద స్వచ్ఛందగా లొంగిపోయాడు. అయితే పోలీసుల విచారణలో చిత్రవిచిత్రమైన వివరణలు చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు.

'నా వద్ద డబ్బు లేదు. ఎవరూ నన్ను గుర్తించి గౌరవించం లేదు. సమాజంలో వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదు. అందుకే తీవ్ర అసంతృప్తి కలిగింది. వ్యవస్థపై ప్రతీకారంతోనే విమానాశ్రయంలో బాంబు పెట్టాలనుకున్నాను. తీరా పెట్టాక తప్పుచేశానని అనిపించింది. అందుకే బెంగళూరు పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాను' అంటూ వివరణ ఇచ్చాడు.

బాంబు పెట్టిన అనంతరం ఆదిత్యరావు ఆ రాత్రి కేఎస్ ఆర్టీసీ బస్సులో బెంగళూరు చేరుకున్నాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. దీంతో ఆదిత్యరావును తీసుకుని తిరిగి మంగళూరు వచ్చిన పోలీసులు తెల్లవారు జాము వరకు అతన్ని విచారించారు.

ఈ సందర్భంగా మంగళూరు నగర పోలీసు కమిషర్ డాక్టర్ హర్ష మాట్లాడుతూ బాంబు కేసును తీవ్రంగానే పరిగణిస్తున్నామని, అన్ని కోణాల్లో విచారిస్తున్నామని అన్నారు. పేలుడు పదార్థాలు ఏ స్థాయివో విచారించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. కాగా, నిందితుడు ఆదిత్యరావును పోలీసులు నిన్న కోర్టులో హాజరుపర్చగా కోర్టు అతనికి పది రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది. 

More Telugu News