Crime News: ఇంటర్ బాలికపై అత్యాచారం.. టెర్రస్ పైనుంచి తోసి హత్య?

  • చదువుకునేందుకు టెర్రస్ పైకి వెళ్లిన విద్యార్థిని
  • రెండు అపార్టమెంట్ల మధ్య విగతజీవిగా పడివున్న వైనం 
  • అత్యాచారం చేసి పై నుంచి తోసేసినట్టు అనుమానం

ప్రేమోన్మాదం మరో బాలికను బలితీసింది. చిలకలగూడ పరిధి వారాసిగూడలో రెండు అపార్ట్ మెంట్ల మధ్య విగతజీవిగా పడివున్న బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఇంటర్ చదువుతున్న బాలికపై టెర్రస్ పై అత్యాచారం చేసి అనంతరం కిందికి తోసి హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. 

పోలీసులు, స్థానికుల కథనం మేరకు...వారాసిగూడలోని ఓ అపార్ట్ మెంట్లో ఈ బాలిక తల్లి, తమ్ముడు, సోదరితో కలిసి ఉంటోంది. ఏడాది క్రితమే తండ్రి చనిపోయాడు. షోయబ్ అనే యువకుడు చాలా రోజులుగా ప్రేమ పేరుతో ఈమె వెంట పడుతున్నాడు. తాను ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని, ఆమె తల్లితో మాట్లాడి రావాల్సిందిగా తన కుటుంబ సభ్యులను కూడా పంపినట్లు సమాచారం.

అయితే తన కుమార్తె మైనర్ అని, చదువుకుంటోదని, తనకు ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదని ఆమె తల్లి తిరస్కరించింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి చదువుకునేందుకని బాలిక టెర్రస్ పైకి వెళ్లి, ఎంతకీ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు టెర్రస్ పైన, చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం కనిపించలేదు.

ఈ రోజు ఉదయం అపార్ట్ మెంట్ లోని ఓ మహిళ టెర్రస్ పైకి వెళ్లింది. ఓచోట రక్తపు మరకలు కనిపించడంతో అనుమానంతో అటువైపు తొంగిచూడగా రెండు భవనాల మధ్య పడివున్న బాలిక కనిపించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు భోరుమన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.

టెర్రస్ పై ఉన్న పరిస్థితులు, రక్తపు మరకలు గమనించిన పోలీసులు బాలికను పై నుంచి కిందికి తోసేసే ముందు ఆమెను తీవ్రంగా హింసించారని, అత్యాచారం కూడా చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు వచ్చే వరకు ఏ విషయం చెప్పలేమని పోలీసులు తెలిపారు.

More Telugu News