chittoor: గుండెపోటుతో భర్త మరణం...తట్టుకోలేక భార్య ఆత్మహత్య!

  • ఒకే రోజు దంపతుల మృతి
  • చిత్తూరు దుర్గానగర్ కాలనీలో ఘటన 
  • స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపిన ఘటన

మూడు దశాబ్దాల వారి ప్రేమ ప్రయాణం అంతా ఆనందమయం. సంతోషంగా జీవితం సాగిపోతున్న సమయాన  భర్త గుండెపోటుతో మరణించడంతో ఆ భార్య తట్టుకోలేకపోయింది. నీవు లేని ఈ లోకంలో నేనుండలేను అంటూ భర్తతోపాటే తనువు చాలించింది. చిత్తూరు జిల్లా కేంద్రంలోని దుర్గానగర్ కాలనీలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన వివరాలు ఇలావున్నాయి.

కాలనీలో నివాసం ఉంటున్న దొరైరాజ్ (63), షర్మిల (50) దంపతులు. బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగి అయిన దొరైరాజ్ పదవీ విరమణ చేశారు. అదే బ్యాంకులో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. భార్య ఉపాధ్యాయిని. వీరికి ఇద్దరు కొడుకులు. ఒకరు హైదరాబాద్ లో, మరొకరు విదేశాల్లో స్థిరపడ్డారు.

బుధవారం ఉదయం నడకకు వెళ్లిన దొరైరాజ్ ఇంటికి తిరిగి వచ్చాక ఛాతిలో నొప్పంటూ కుప్పకూలిపోయారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు అప్పటికే చనిపోయినట్టు నిర్థారించారు. భర్త మరణ వార్త వినగానే షర్మిల షాక్ కు లోనయ్యారు.

చీకటి చుట్టుముట్టినట్టు, ప్రపంచమే శూన్యమైనట్టు భావించిన ఆమె బాత్ రూంలోకి వెళ్లి అక్కడ ఉన్న యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం చనిపోయింది. దంపతులు ఇద్దరూ ఒకే రోజు మృతి చెందడంతో కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది.

కుటుంబ సభ్యులు, అయిన వారు, బంధువులు, కాలనీవాసుల కన్నీటి వీడ్కోలు మధ్య నిన్న దంపతులు ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు.

More Telugu News