Galla Jayadev: గల్లా జయదేవ్ పై మరో నాన్ బెయిలబుల్ కేసు... అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్న పోలీసులు!

  • మూడు రోజుల క్రితం అరెస్ట్
  • జైలుకు తరలించిన పోలీసులు
  • వెంటనే బెయిల్ మంజూరు
  • ఆపై పోలీసులపై దాడి చేసినట్టు మరో కేసు

తెలుగుదేశం పార్టీ నేత, గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ పై మరో నాన్ బెయిలబుల్ కేసు దాఖలు కాగా, ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ముట్టడి రోజు గల్లాను పోలీసులు అరెస్ట్ చేసి, గుంటూరు సబ్ జైలుకు తరలించగా, అదే రోజు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.

అయితే, ముట్టడి సందర్భంగా గల్లా, ఆయన అనుచరులు చిట్టి బాబు, వినయ్, దామోదర్ చౌదరి తదితరులపై కొంతమంది కానిస్టేబుళ్లు ఇచ్చిన ఫిర్యాదుపై తుళ్లూరు పీఎస్ లో క్రైమ్ నంబర్ 31/2020 నమోదైంది. రెడ్ విత్ 149తో పాటు ఐపీసీలోని 143, 188, 353, 324, 332 తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది.

గల్లా జయదేవ్ బందోబస్తు విధుల్లో ఉన్న తమపై దౌర్జన్యానికి ప్రేరేపించారని గుంటూరు జిల్లా దుర్గి మండలం ముటుకూరు హెడ్ కానిస్టేబుల్ పెరంబదూరి వేణుగోపాలస్వామి ఫిర్యాదు చేశాడు. తమను నెట్టుకుంటూ అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారని, దీంతో అవే సెక్షన్ల కింద క్రైమ్ నంబర్ 31గా రెండో కేసును పెట్టినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఆందోళనకారులు గుంపుగా వచ్చి సచివాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వేళ, వారిని వెనక్కు పంపేందుకు తాము ప్రయత్నిస్తుండగా, వీళ్లను రాళ్లతో కొట్టాలంటూ, కొందరు రాళ్లు విసిరారని, వాటిల్లో ఒకటి తన కుడి కంటి పైభాగంలో తగిలిందని ఏఆర్ కానిస్టేబుల్ గజ్జల హరీశ్ ఫిర్యాదు చేశారు. గాది లింగం అనే మరో కానిస్టేబుల్ కు నుదుటిపైనా, రాజమండ్రికి చెందిన నాగరాజు, వీరప్పనాయక్ అనే పోలీసులకు ఇతర చోట్ల గాయాలు అయ్యాయని, ఇక్కడి తీవ్రతను గమనించిన ఫోర్స్, తమను రక్షించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఆపై తాము విచారించగా, గల్లా జయదేవ్ తో పాటు మరికొందరు దాడి చేసినట్టు వెల్లడైందని అన్నారు. ఇక ఈ కేసులో జయదేవ్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇదే సమయంలో ప్రజా ప్రతినిధులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని టీడీపీ వారు ఆరోపించారు.

More Telugu News