Charminar: ఎంఐఎం కార్యక్రమాలకు అనుమతి ఇచ్చి.. మాకు ఇవ్వరా?: బీజేపీ చీఫ్ లక్ష్మణ్

  • కిషన్‌రెడ్డికి గౌరవం ఇవ్వడం లేదు
  • ఉద్దేశపూర్వకంగానే అసదుద్దీన్ రెచ్చగొట్టే ప్రసంగాలు
  • వారి ర్యాలీకి అనుమతిస్తే.. మేం కూడా చేస్తాం

చార్మినార్ వద్ద రేపు ఎంఐఎం తలపెట్టిన ర్యాలీకి అనుమతి ఇవ్వొద్దని, ఒకవేళ కాదని ఇస్తే కనుక తాము వేరే చోట ఆందోళన చేస్తామని బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్ హెచ్చరించారు. వారి ర్యాలీకి అనుమతి ఇస్తే ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అల్లకల్లోలం సృష్టించిన వారు అవుతారని పోలీసులకు తేల్చిచెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్సీ రామచందర్‌రావుతో కలిసి పోలీస్  కమిషనర్ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. బీజేపీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని, నగరంలోని వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కనీస గౌరవం ఇవ్వడం లేదని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

మజ్లిస్ కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. అయినా సరే పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. రేపటి మజ్లిస్ ర్యాలీకి అనుమతి ఇస్తే తాము కూడా వేరే చోట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

More Telugu News