Telugudesam: జగన్ మొండి వైఖరిని వీడాలి: టీడీపీ నేత వర్ల రామయ్య

  • రాజధానిపై వాదించేందుకు న్యాయవాదికి రూ.5 కోట్లు ఇస్తారా?
  • ప్రజల డబ్బుతో ప్రజలను ఓడించాలనుకుంటున్నారా?
  • దేశంలో ఏ ప్రభుత్వమూ ఒక కేసుకు ఇంత పెద్ద మొత్తం ఇవ్వలేదు

 రాజధాని మార్పు విషయంలో సీఎం జగన్ అంత మొండిగా వుండడం తగదని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ నిర్ణయంతో రాష్ట్రమంతా అట్టుడుకుతోందన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా జగన్ మొండిగా ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు.  ప్రతి విషయానికి జగన్ ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు. మండలికి 23మంది మంత్రులు రావాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

రాజధాని రైతులకు వ్యతిరేకంగా వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించి ఆయనకు ఫీజు రూపేణ  ఐదు కోట్ల రూపాయల ప్రజాధనం ఇస్తున్నారని విమర్శించారు. అది ప్రజల డబ్బంటూ.. దాంతోనే తిరిగి ప్రజలను ఓడించాలని చూస్తారా అని నిలదీశారు. జగన్ అవినీతి కేసులతో కలిపి వాదించేందుకు రోహత్గీకి అంతమొత్తం ఇచ్చారా? అని వర్ల ప్రశ్నించారు. దేశంలో ఏ ప్రభుత్వమూ ఓ కేసు కోసం న్యాయవాదులకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వలేదని పేర్కొన్నారు.

More Telugu News