Budda venkanna: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు ‘గుడ్ డే’: బుద్ధా వెంకన్న

  • భగవంతుడి రూపంలో మండలి ఛైర్మన్ ఆదుకున్నారు
  • టీవీ ప్రసారాలు నిలిపివేస్తే.. చంద్రబాబు మండలికి వచ్చారు
  • ఛైర్మన్ షరీఫ్ ను మంత్రులు తిట్టడం బాధాకరం

శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని ఛైర్మన్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి చెప్పడాన్ని టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్వాగతించారు. దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు ‘గుడ్ డే’ అని అన్నారు. రాజధానిని మూడు ముక్కలు చేయాలని వైసీపీ నేతలనుకున్నారని, కానీ వారి వ్యూహం బెడిసికొట్టిందన్నారు.

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలను దుర్భాషలాడుతూ.. అక్కడ బిల్లును పాస్ చేసుకున్నారు... కానీ మండలిలో వారి ఆట సాగలేదని ఎద్దేవా చేశారు. దేవుడు కూడా ఇందుకు తోడ్పడ్డాడని చెప్పారు. మండలిలో మంత్రులు కూర్చుని ఛైర్మన్ ను బెదిరించే ధోరణిని వ్యక్తం చేశారని ఆరోపించారు.

టీవీ ప్రసారాలు నిలిపివేస్తే.. చంద్రబాబు మండలిలో గ్యాలరీకి వచ్చి కూర్చున్నారని చెప్పారు. చంద్రబాబుపై మంత్రి బుగ్గన విమర్శలు చేయడం సబబు కాదన్నారు. మండలి ఛైర్మన్ షరీఫ్ ను మంత్రులు తిట్టడం బాధాకరమన్నారు. ఎట్టకేలకు ధర్మం గెలిచిందని వెంకన్న వ్యాఖ్యానించారు.

More Telugu News