Andhra Pradesh: శాసనమండలిలో టీడీపీ వర్సెస్ వైసీపీ... సెలెక్ట్ కమిటీపై వాదోపవాదాలు

  • వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో రగడ
  • బిల్లును సెలెక్ట్ కమిటీ ముందుకు పంపే విషయంలో వాగ్యుద్ధాలు
  • ఫ్లోర్ లీడర్లతో సమావేశం కావాలని భావిస్తున్న మండలి చైర్మన్

వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీలో ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకపోయినా, శాసనమండలిలో మాత్రం ప్రతిఘటన ఎదురైంది. మండలిలో టీడీపీ బలం ఎక్కువగా ఉండడంతో అధికార వైసీపీకి నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో, వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీ ముందుకు పంపే విషయంపై వాదోపవాదాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ అంశంపైనే మండలిలో వైసీపీ, టీడీపీ సభ్యులు చైర్మన్ కు తమ వాదనలు వినిపిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ నేత యనమల ఎవరికి వారు తమ పంతం నెగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరమే లేదని బొత్స అంటుండగా, సెలెక్ట్ కమిటీ ముందుకు పంపాల్సిందేనని యనమల పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో శాసనమండలి ఫ్లోర్ లీడర్లతో సమావేశం కావాలని చైర్మన్ షరీఫ్ భావిస్తున్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరనున్నారు. బిల్లుపై చర్చ పూర్తయినందున నాన్ మెంబర్లు అయిన మంత్రులు సభలో ఉండకూడదని టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

More Telugu News