Telangana Municipal Elections: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్

  • 9 మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు
  • మధ్యాహ్నం 3 గంటల వరకు  67.46 శాతం పోలింగ్ నమోదు
  • బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమయిన అభ్యర్థుల భవితవ్యం
  • శనివారం వెలువడునున్న ఫలితాలు

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ.. మొత్తానికి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో మధ్యాహ్నం  67.46 శాతం పోలింగ్ నమోదు అయిందన్నారు.

కొన్ని చోట్ల టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నప్పటికీ, పోలీసుల జోక్యంతో పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. కొన్ని చోట్ల పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారని తెలుస్తోంది.

సాయంత్రం ఐదు గంటలవరకు క్యూలో నిలుచున్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మొత్తం 120 మున్సిపాలిటీల్లోని 2,727 వార్డుల్లో 80 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,647 వార్డుల్లో పోలింగ్ జరిగింది. శనివారం ఈ ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. 9 కార్పొరేషన్లలో 325 డివిజన్లలో ఒక డివిజన్ ఏకగ్రీవంకాగా, 324 డివిజన్లలో పోలింగ్ జరిగింది. కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికలకు ప్రచార గడువు ముగిసింది. ఇక్కడ పోలింగ్ 24న జరుగనుంది. 27న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను ప్రకటించనున్నారు.

More Telugu News