Bandi Sanjay: తన భద్రతను వాపస్ పంపిన బీజేపీ ఎంపీ బండి సంజయ్

  • కరీంనగర్ ఎంపీ సంజయ్ సంచలన నిర్ణయం
  • వ్యక్తిగత భద్రతను ఉపసంహరించుకున్న వైనం
  • ప్రత్యేక భద్రతను కూడా

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ కు చెందిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత భద్రతను ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా, తనకు ఉన్న ప్రత్యేక భద్రతను సైతం ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంగా తన భద్రతా సిబ్బందిని వెనక్కి పంపివేశారు.

కాగా, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయనపై ఇటీవల రాళ్ల దాడి జరిగిందన్న వార్తల నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించారు. అయితే, బండి సంజయ్ పై రాళ్ల దాడి జరగలేదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ వదంతి వ్యాపించిందని, రాళ్ల దాడి ఘటన అబద్ధమని తేల్చిచెప్పారు.

 ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ తన ప్రత్యేక భద్రతను వాపస్ పంపినట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఏ ప్రజాప్రతినిధిపైనా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడా రాళ్ల దాడులు, భౌతిక దాడులు జరగలేదని చెప్పారు. ఒకవేళ అలాంటి దాడులు జరిగివుంటే వెంటనే తాము స్పందించేవారమని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో కొంత మంది ఉద్దేశపూర్వకంగా రాళ్ల దాడి జరిగిందంటూ వదంతులు సృష్టించి, ప్రజలను తప్పుదోవ పట్టించారని చెప్పారు.

More Telugu News