Rajnath Singh: అమెరికా, పాకిస్థాన్ మత రాజ్యాలే.. భారత్ లో అన్ని మతాలు సమానమే: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్

  • భారత్ మత రాజ్యంగా ఎప్పటికీ మారదు
  • దేశంలో నివసించే వారంతా ఒకే కుటుంబంగా భావిస్తాం
  • మనదేశం వసుధైక కుటుంబమని ఈ ప్రపంచానికి చాటాలి

దేశంలో అన్ని మతాలకు సమాన విలువ ఉందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత్ ఎప్పటికీ పాకిస్థాన్ వంటి మత రాజ్యం కాబోదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎన్ సీసీ రిపబ్లిక్ డే క్యాంప్ నుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. మత ప్రాతిపదికన భారత్ లో వివక్ష ఉండదంటూ..  అలా ఎందుకుండాలని ప్రశ్నించారు. అన్ని మతాలు సమానమని భారతీయ ధర్మం చాటుతుందన్నారు. కాబట్టే భారత్ లౌకిక దేశంలా కొనసాగుతోందన్నారు.

పొరుగుదేశమైన పాకిస్థాన్ మతపరమైన దేశమని ప్రకటించుకుందన్నారు. భారత్ అలా ఎన్నడూ చేయదని చెప్పారు. అమెరికా సైతం మత రాజ్యమేనంటూ.. భారత్ మాత్రం మత ప్రమేయంలేని దేశమన్నారు. దేశంలో నివసించే వారంతా ఒకే కుటుంబంగా మనందరం భావిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రపంచంలో నివసిస్తున్న వారంతా ఒకే కుటుంబమని ఆయన పేర్కొన్నారు. మనదేశం వసుధైక కుటుంబమని ఈ ప్రపంచానికి చాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భారత్ ఏ ఒక్క మతాన్నీ తమ మతమని ప్రకటించలేదని.. హిందూ, సిక్కు, బౌద్దం.. తదితర మతాలు ఇక్కడ ఉన్నాయన్నారు.

More Telugu News