Jagan: జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పవన్ ఆంధ్రాలో ఎక్కడా తిరగలేరు: మంత్రి వెల్లంపల్లి హెచ్చరిక

  • టీడీపీ డైరెక్షన్ లో, బీజేపీ ముసుగులో పవన్
  • జగన్ పై అవాకులు చవాకులు మాని షూటింగ్ చేసుకోండి
  • విజయవాడ అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోంది

కేంద్రం ముసుగులో రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించాలని చూస్తే సహించే ప్రసక్తే లేదంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. విజయవాడ, పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురంలో బీటీ రోడ్డు నిర్మాణానికి ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. 28వ డివిజన్ లో కోటి నలభై లక్షల రూపాయలతో ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు అడిగి మంత్రి తెలుసుకున్నారు.

అనంతరం, వెల్లంపల్లి మాట్లాడుతూ, రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. టీడీపీ డైరెక్షన్ లో, బీజేపీ ముసుగులో ఏపీ అభివృద్ధికి ఇబ్బంది కలిగించాలని చూస్తే సహించమని, పవన్ ఆంధ్రాలో ఎక్కడా తిరగలేరని హెచ్చరించారు. సీఎం జగన్ పై అవాకులు చవాకులు పేలడం మాని షూటింగ్ చేసుకోవాలని హితవు పలికారు. విజయవాడ నగర అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. గత పాలకులు విజయవాడ నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

More Telugu News