Green India Challenge: టీఆర్ఎస్ ఎంపీ పిలుపునకు స్పందించిన వైజయంతీ మూవీస్

  • జోరుగా గ్రీన్ ఇండియా చాలెంజ్
  • హరిత ఉద్యమానికి ప్రాణం పోసిన టీఆర్ఎస్ ఎంపీ
  • చాలెంజ్ స్వీకరించిన అశ్వినీదత్, ప్రియాంక

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కు విశేష ఆదరణ లభిస్తోంది. సెలబ్రిటీల్లో చాలామంది ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటుతూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

తాజాగా కె.రఘురామరాజు తమను నామినేట్ చేయడంతో వైజయంతీమూవీస్ తరఫున నిర్మాత అశ్వినీదత్, ఆయన తనయ ప్రియాంక దత్ మూడు మొక్కలు నాటి సామాజిక చైతన్య కార్యక్రమంలో తమవంతు కర్తవ్యం నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా, ఈ చాలెంజ్ లో భాగంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, యువ హీరోలు నాని, విజయ్ దేవరకొండలను నామినేట్ చేశారు.

దీనిపై ఎంపీ సంతోష్ ట్విట్టర్ లో స్పందించారు. ఈ కుటుంబం ఎంతో ప్రేమానురాగాలతో మొక్కలు నాటడం చూస్తుంటే సంతోషంగా ఉందని తెలిపారు. ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగస్వాములైన అశ్వనీదత్, ప్రియాంకలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

More Telugu News