YS Vijayamma: విజయమ్మను విజయ అన్నవారిని.. జగన్ ను ఉరి తీయాలన్నవారిని పార్టీలో చేర్చుకున్నారు: ప్రసన్నకుమార్ రెడ్డి

  • విజయమ్మను విజయ అని బొత్స అన్నారు
  • జగన్ ను ఉరి తీయాలని ఆనం అన్నారు
  • విజయమ్మను తిట్టిన బొత్సకు మంత్రి పదవి ఇచ్చారు

నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి బొత్స, దివంగత ఆనం వివేకానందరెడ్డిలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మను ఒకప్పుడు అసెంబ్లీలో విజయ అంటూ బొత్స సత్యనారాయణ సంబోధించారని ఆయన అన్నారు.

జగన్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడారని... ఆయన సోదరుడు, దివంగత ఆనం వివేకానందరెడ్డి ఏకంగా జగన్ ను ఉరి తీయాలని అన్నారని చెప్పారు. ఇలాంటి వారందరినీ పార్టీలో చేర్చుకుని, ప్రాధాన్యతను ఇచ్చారని చెప్పారు.

విజయమ్మను తిట్టిన బొత్సకు మంత్రి పదవి ఇచ్చారని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. పార్టీలో విజయమ్మ తర్వాత తాను రెండో ఎమ్మెల్యేనని... పార్టీలో సీనియర్ అయిన తనకు పదవి ఇవ్వకపోయినా బాధపడలేదని చెప్పారు. జగన్ సీఎం కావాలని మాత్రమే కోరుకున్నానని అన్నారు.

విడవలూరు మండలంలోని టీడీపీ నేతలు వంశీరెడ్డి, భాస్కర్ రెడ్డిలను వైసీపీలోకి చేర్చుకోవాలని ప్రసన్నకుమార్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే, ఆయన నిర్ణయాన్ని ఇతర వైసీపీ శ్రేణులు ఒప్పుకోలేదు. ఈ నెల 16న నెల్లూరులోని ఆయన నివాసం వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకు ఆయన ప్రయత్నించారు. ఆ సందర్భంలోనే ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News