Prakasam District: తీసుకున్న అప్పు తిరిగి అడిగాడని.. యాసిడ్‌తో దాడి

  • తీసుకున్న డబ్బులు ఇవ్వమన్నందుకు గొడవ
  • యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు
  • వ్యక్తి పరిస్థితి విషమం

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమన్నందుకు యాసిడ్‌తో దాడిచేసిన ఘటన ప్రకాశం జిల్లాలోని వలేటివారిపాలెంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కలవళ్ల గ్రామానికి చెందిన రమేశ్ నుంచి మేడికొండ కిరణ్ కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలంటూ కిరణ్‌పై ఇటీవల రమేశ్‌ ఒత్తిడి తీసుకొచ్చాడు. అయినప్పటికీ అతడి నుంచి స్పందన లేకపోవడంతో కిరణ్ సోదరుడు అంకయ్య నిర్వహిస్తున్న పాలకేంద్రం వద్ద రమేశ్ పాలు తీసుకుని స్థానికంగా విక్రయిస్తూ వచ్చిన నగదును అప్పుకింద జమచేసుకుంటున్నాడు.

ఈ క్రమంలో కిరణ్, అంకయ్య, రమేశ్ మధ్య అప్పు విషయమై ఘర్షణ జరిగింది. తమకు ఇవ్వాల్సిన మొత్తం డబ్బులు చెల్లించాల్సిందేనంటూ రమేశ్ తల్లి కోటమ్మ వారితో వాగ్వివాదానికి దిగింది. ఇది మరింత పెరగడంతో పక్కనే ఉన్న యాసిడ్ బాటిల్‌ను అందుకున్న అంకయ్య.. రమేశ్, ఆమె తల్లిపై చల్లాడు. వారిద్దరితోపాటు పక్కనే ఉన్న రమేశ్ తండ్రి కోటయ్యపైనా యాసిడ్ పడింది. తీవ్ర గాయాలపాలైన ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కోటయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News