Telangana: ప్రారంభమైన తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు... ఓటర్లకు రకరకాల ప్రలోభాలు!

  • ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్
  • 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు
  • బరిలో 12,843 మంది అభ్యర్థులు

తెలంగాణలో మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ నేటి ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ జరుగనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరుగనుండగా, మొత్తం 12,843 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 53.50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇక ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు, పోటీలో నిలిచిన అభ్యర్థులు, ఓటుకు రూ. 5 వేల వరకూ చెల్లించినట్టు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో ఓటర్లకు ఒక గ్రాము లక్ష్మీరూపు నాణాలు, వెండి సామగ్రి, పట్టు చీరలు తదితరాలతో పాటు డబ్బులు కూడా పంచారు. డబ్బులు పంచేందుకు గూగుల్ పే, పేటీఎం తదితర మాధ్యమాల ద్వారా ఓటర్ల ఫోన్ నంబర్ కు అనుసంధానమై ఉండే బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు చేరాయి.

ఇక ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఒక్క దొంగ ఓటు పడినా, అక్కడ రీపోలింగ్ ఉంటుందని ఎన్నికల కమిషన్ హెచ్చరించడం గమనార్హం. పోలింగ్ కేంద్రంలో డిమాండ్ ఓటును ఎవరైనా వేస్తే, అక్కడ రీపోలింగ్ కు సిఫార్సు చేస్తామని ఇప్పటికే తెలంగాణ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికలన్నీ వార్డుల పరిధిలో జరుగనున్నందున దొంగ ఓట్లను వేసేవారిని సులువుగా తెలుసుకోవచ్చని, మరో వ్యక్తి పేరిట ఓటు వేయడానికి ఎవరైనా వస్తే, వారిని స్థానికులు సులువుగా గుర్తించవచ్చని ఆయన అన్నారు.

More Telugu News