Andhra Pradesh: పోలీసులు కొడుతుంటే ఆ రైతు 'అమ్మా' అని అరవలేకపోయాడు... ఎందుకంటే అతడికి మాటలు రావు కాబట్టి!: పవన్

  • కిరణ్ నాయక్ అనే రైతును పరామర్శించిన పవన్
  • కిరణ్ మూగవాడు అని తెలియడంతో చలించిపోయిన జనసేనాని
  • వైసీపీ సర్వనాశనానికి దారితీస్తుందని వ్యాఖ్యలు

రాజధాని అమరావతి రైతులు మంగళగిరి జనసేన కార్యాలయానికి తరలి వెళ్లి పవన్ కల్యాణ్ ను కలిశారు. నిన్న పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన వారిని చూసి పవన్ కల్యాణ్ చలించిపోయారు. ముఖ్యంగా కిరణ్ నాయక్ అనే రైతును చూసి పవన్ కదిలిపోయారు. అందుకు కారణం కిరణ్ నాయక్ మాటలు రాని మూగవాడు కావడమే! లాఠీచార్జిలో కిరణ్ పైనా పోలీసులు లాఠీలు ఝుళిపించారని పవన్ కు ఇతర రైతులు చెప్పారు. దాంతో పవన్ తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు.

"మనం ఒంటిపై ఒక్క దెబ్బ పడితే 'అమ్మా' అంటాం. కానీ కిరణ్ ఒంటిపై పోలీసు లాఠీలు విరుచుకుపడినా కనీసం 'అమ్మా' అని కూడా అనలేక, తన బాధను బయటికి చెప్పుకోలేక ఎంత వేదన అనుభవించి ఉంటాడో అర్థం చేసుకోగలను. కిరణ్ రాజధాని అమరావతి కోసం తన అరెకరం పొలాన్ని త్యాగం చేశాడు. రాజధాని కోసం ఉద్యమిస్తున్న అతడిని పోలీసులు కొట్టారు. పాపం, కిరణ్ గట్టిగా అరిచి తన బాధను చెప్పలేకపోయాడు. అలాంటి వాళ్ల బాధలను దేవుడు తప్పక వింటాడు. ఇది  వైసీపీ వినాశనానికి తప్పక దారితీస్తుంది" అంటూ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేశారు.

More Telugu News