Amit Shah: పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించే ప్రసక్తే లేదు: అమిత్ షా పునరుద్ఘాటన

  • అయోధ్యలో మూడు నెలల్లో రామ మందిరం నిర్మిస్తాం
  • ‘తుకడే తుకడే’ సమూహానికి కాంగ్రెస్ మద్దతిస్తోంది  
  • భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తే జైలుకే..

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ఉపసంహరించే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ రోజు  లక్నోలో సీఏఏకు మద్దతు తెలుపుతూ చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఏఏను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోమన్నారు. దేశాన్ని ముక్కలు చేయాలంటున్న 'తుక్డే తుక్డే' సమూహానికి కాంగ్రెస్ మద్దతిస్తోందని పేర్కొన్నారు. భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తే జైలుకేనని తెలిపారు.

కాంగ్రెస్, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒకే రీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఏఏకు వ్యతిరేకంగా భారీ కుట్ర జరుగుతోందని.. ఈ చట్టంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీలు ఎక్కడ కోరుకుంటే అక్కడ చర్చకు సిద్ధమని అమిత్ షా సవాల్ విసిరారు. దేశంలో కాంగ్రెస్ అల్లర్లను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. మూడు నెలల్లో అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని ప్రకటించారు.

More Telugu News