Botsa Satyanarayana Satyanarayana: ఏ ఎమ్మెల్సీకి ఫోన్ చేశానో దమ్ముంటే నిరూపించాలి: యనమలకు బొత్స సవాల్

  • శాసనమండలిలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై చర్చ
  • మద్దతు కోసం మా ఎమ్మెల్సీలకు బొత్స ఫోన్ చేశారన్న యనమల
  • ఆ ఆరోపణలను ఖండించిన బొత్స

ఏపీ శాసనమండలిలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇవాళ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్సీలకు బొత్స ఫోన్ చేసి ప్రలోభాలకు గురిచేశారని యనమల ఆరోపించారు. ఈ ఆరోపణను బొత్స ఖండించారు. ఏ ఎమ్మెల్సీకి ఫోన్ చేశానో యనమలకు దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు.

టీడీపీ సభ్యుడిలా మండలి చైర్మన్ షరీఫ్ వ్యవహరిస్తున్నారు

ఇదే సమయంలో శాసనమండలి చైర్మన్ షరీఫ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుడిలా షరీఫ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మండలి చైర్మన్ పనితీరు ఓ మచ్చగా మిగిలిపోతుందని, పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని, తనకు ఉన్న విచక్షణాధికారాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవద్దని సూచించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారమే తాను వ్యవహరిస్తున్నానని, తనకు రాజకీయాలు ఆపాదించొద్దని  శాసనమండలి చైర్మన్ షరీఫ్ అన్నారు.

More Telugu News