BJP: కచ్చితంగా చెబుతున్నా.... నడ్డా బీజేపీని మరోస్థాయికి తీసుకెళతారు: మోదీ

  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా ఎన్నిక
  • శుభాకాంక్షలు తెలిపిన మోదీ
  • అమిత్ షాపైనా ప్రశంసలు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నూతన అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. తన పదవీకాలంలో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నట్టు మోదీ ట్వీట్ చేశారు.

"నడ్డా గారు క్రమశిక్షణ, అంకింతభావం ఉన్న కార్యకర్త. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అనేక సంవత్సరాలుగా కృషి చేశారు. ఆయన స్నేహశీలి అన్న సంగతి అందరికీ తెలుసు. యువ కార్యకర్తగా మొదలుపెట్టి హిమాచల్ ప్రదేశ్ లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, సంస్థాగత పదవుల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా వాటికి విలువ తెచ్చారు. నేను కచ్చితంగా చెప్పగలను... నడ్డా అధినాయకత్వంలో బీజేపీ సరికొత్త శిఖరాలకు చేరుతుంది" అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా మోదీ బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్ షాను సైతం కొనియాడారు. బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా అందించిన సుసంపన్న సేవల గురించి చెప్పాలంటే పదాలు సరిపోవని పేర్కొన్నారు. పార్లమెంటులో బీజేపీకి అత్యధిక స్థానాలు లభించడం, దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడం అన్నీ కూడా అమిత్ షా హయాంలో జరిగాయని, ఆయనో అద్భుతమైన కార్యకర్త అని కితాబిచ్చారు.

More Telugu News