Actress: వైద్యుడే నిజమైన హీరో: పూజ హెగ్డే

  • క్యాన్సర్ బాధిత చిన్నారులకోసం రూ.2.5 లక్షల విరాళం
  • ప్రతి ఒక్కరూ ఇలాంటి వారికి సాయం చేయాలి 
  • ఆర్థిక సాయం చేసి ఇలాంటి బాధితులను ఆదుకోవాలి

అందాల తార పూజ హెగ్డే క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం ఆర్థిక సహాయం చేసి తన ఉదారతను చాటారు. ఇలాంటి బాధితులను ఆదోకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. హైదరాబాద్ లో క్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పూజ ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సంస్థ ద్వారా లబ్ధిపొంది క్యాన్సర్ నుంచి బయటపడ్డ పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారుల కోసం రూ.2.5 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.

తాను వైద్యుల కుటుంబం నుంచి వచ్చానని.. తన స్నేహితులు కూడా వైద్యులేనని చెప్పారు. వైద్యుడే నిజమైన హీరో అని భావిస్తాను అని పూజ పేర్కొన్నారు. ‘ క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం తగినన్ని నిధులను సమకూర్చి వారి జీవితాలను కాపాడాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ జీవితంలో మంచి పనులు చేయాలని అనుకుంటారు. అయితే అవి ఎలా చేయాలన్న దానిపై వారికి అవగాహన ఉండదు. ఇలాంటి సంస్థలకు ఆర్థిక సాయం చేసి బాధిత చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నాను’ అని ఆమె అన్నారు.

More Telugu News