Jagan: మీ ఆదేశాలను అమలు చేస్తాం అధ్యక్షా: జగన్

  • టీడీపీ నేతలు బినామీల పేర్లతో భూములు కొన్నారన్న బుగ్గన
  • విచారణ జరిపించాలని సీఎంను కోరిన స్పీకర్
  • స్పీకర్ ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పిన జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు తమ బినామీల పేర్లతో భూములను కొన్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో పలువురి పేర్లను కూడా ప్రస్తావిస్తూ వివరాలను చదివి వినిపించారు. దీంతో, టీడీపీ నేతలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మంత్రి అన్నీ అసత్యాలను చెబుతున్నారని వారు మండిపడ్డారు. మీరు చెప్పేదాంట్లో నిజం ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాంకు, టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ సీరియస్ అయ్యారు.

ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ, ఇవి నిజాలైనా, ఆరోపణలైనా వాస్తవాలు ప్రజలకు తెలియాల్సి ఉందని అన్నారు. ఈ అంశంపై సమగ్రమైన విచారణ జరిపి, దోషులెవరో ప్రజలకు తెలపాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. వెంటనే జగన్ మాట్లాడుతూ, శాసనసభ స్పీకర్ ది అత్యున్నతమైన స్థానమని... ఆ స్థానం నుంచి వచ్చిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని... ఇన్సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపిస్తామని చెప్పారు.

More Telugu News