Tirumala: తిరుమలలో భక్తులందరికీ ఉచిత లడ్డూ.. నేటి నుంచే అమలు!

  • స్వామిని దర్శించుకునే భక్తునికి ఒక లడ్డూ
  • ఆపై రూ. 50పై ఎన్నయినా కొనుక్కునే సౌకర్యం
  • లడ్డూల కొరత లేకుండా చూస్తామన్న ధర్మారెడ్డి

తిరుమల వెంకన్నను దర్శించుకునే భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా భావించే లడ్డూ ప్రసాదం, ఇకపై ఉచితంగానే భక్తుల చేతిలోకి రానుంది. స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికీ ఓ లడ్డూను ఫ్రీగా అందించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయం, ఈ ఉదయం నుంచి అమలులోకి వచ్చింది. ప్రస్తుతం అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల నుంచి నడచి వచ్చిన 20 వేల మంది భక్తులకు మాత్రమే ఉచిత లడ్డూను ఇస్తున్నామని, ఇకపై ప్రతి భక్తుడికి లడ్డూ ప్రసాదం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

కాగా, అదనంగా లడ్డూలు కావాల్సిన వారికి ఒక్కో లడ్డూ రూ. 50పై ఎన్నయినా అందిస్తామని, అందుకు ఏర్పాట్లు జరిగాయని టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం నాలుగు ఎల్పీటీ కౌంటర్లు పనిచేస్తుండగా, భక్తుల సౌకర్యం మేరకు వాటి సంఖ్యను 12కు పెంచామని ఆయన అన్నారు. లడ్డూల కొరత లేకుండా చూసేందుకు నిత్యమూ 4 లక్షల లడ్డులను సిద్ధం చేస్తామని తెలిపారు.

More Telugu News