CJI: పౌరసత్వం అంటే కేవలం హక్కు మాత్రమే కాదు: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

  • పౌరసత్వం అంటే సమాజం పట్ల బాధ్యత కూడా
  • న్యాయాన్ని పరిరక్షించడం పవిత్రమైన కార్యం
  • ఈరోజు న్యాయం అనిపించినది రేపు అన్యాయం అనిపించవచ్చు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వం అంటే కేవలం హక్కు మాత్రమే కాదని, సమాజం పట్ల పౌరులకు ఉన్న బాధ్యత కూడా అని చెప్పారు. బాధ్యత గల పౌరులుగా ఉండాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపై ఉందని అన్నారు. రాష్ట్రసంత్ తుకాడోజి మహరాజ్ నాగపూర్ యూనివర్శిటీ 107వ స్నాతకోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

న్యాయాన్ని పరిరక్షించడం ఒక పవిత్రమైన కార్యమని జస్టిస్ బాబ్డే ఈ సందర్బంగా అన్నారు. న్యాయాన్ని పొందడం అనేది దేశంలోని ప్రతి వ్యక్తికి సహజసిద్ధంగా లభించిన హక్కు అని చెప్పారు. న్యాయం విషయంలో సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి వ్యక్తుల అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయని అన్నారు. ఈరోజు న్యాయం అనిపించినది రేపు అన్యాయంగా అనిపించవచ్చని చెప్పారు. న్యాయంతో పాటు హక్కులు, బాధ్యతలు కూడా అంతే సమానమైనవని అన్నారు. మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించకపోతే.. సమాజం సమతుల్యతను కోల్పోతుందని చెప్పారు.

More Telugu News