Shabana Azmi: షబానా అజ్మీ డ్రైవర్ పై కేసు నమోదు.. షబానాకు అయిన గాయాల వివరాలు ఇవే!

  • నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేశాడంటూ ఎఫ్ఐఆర్
  • కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షబానా
  • పరామర్శించేందుకు ఆసుపత్రికి క్యూ కడుతున్న బాలీవుడ్ ప్రముఖులు

బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ముంబై-పూణె ఎక్స్ ప్రెస్ వేపై నిన్న మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రక్కును వెనుకవైపు నుంచి వీరి కారు గుద్దుకుంది. ఈ ప్రమాదంలో షబానా అజ్మీ గాయాలపాలయ్యారు. ఇదే వాహనంలో ప్రయాణిస్తున్న ఆమె భర్త, బాలీవుడ్ గీత రచయిత జావెద్ అఖ్తర్ మాత్రం చిన్న గాయాలతో బయటపడ్డారు. మరోవైపు, కారు డ్రైవర్ యోగేంద్ర కామత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ట్రక్కు డ్రైవర్ రాజేశ్ పాండురంగ్ షిండే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. కారు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు.

మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే షబానా అజ్మీని హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. డాక్టర్లు వెల్లడించిన వివరాల ప్రకారం పబానా తలకు గాయాలయ్యాయి. వెన్నుపూస కూడా స్వల్పంగా డ్యామేజ్ అయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఆమెను మెడికల్ అబ్జర్వేషన్ లో ఉంచారు. మరోవైపు, షబానాను పరామర్శించేందుకు బాలీవుడ్ ప్రముఖులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు.

More Telugu News