Nara Lokesh: బొత్స సత్యనారాయణ నిజం చెప్పారు: రెండు వీడియోలు పోస్ట్ చేసిన లోకేశ్

  • రాజధాని అమరావతిలోనే ఉంటుందని అప్పట్లో చెప్పిన బొత్స
  • భూకబ్జాలు చేసే వారికే రాజధాని మార్పు  కావాలని బొత్స వ్యాఖ్య
  • 'ఈ అబద్ధపు నోట తన్నుకొచ్చిన నిజం' అంటూ లోకేశ్ విమర్శ

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఇటీవల అమరావతి రాజధానిపై బొత్స సత్యనారాయణను మీడియా పలు ప్రశ్నలు అడిగింది. అయితే, వాటిని దాటవేసే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. గతంలో రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన పోస్ట్ చేశారు.
 
రాజధాని అమరావతిలోనే ఉంటుందని, అక్కడే ఉండాలి కూడా అని కొన్నేళ్ల క్రితం బొత్స సత్యనారాయణ అన్నట్లు ఆ వీడియోలో ఉంది.  జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయం చెప్పారని ఆయన అన్నారు. భూకబ్జాలు చేసే వారికే రాజధాని మార్పు  కావాలని అన్నారు. అయితే, నిన్న బొత్స రాజధాని విషయంపై మరోలా మాట్లాడారు. ఐదేళ్లు  పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా టీడీపీని విమర్శించారు. ఇప్పుడు వచ్చి ప్రశ్నిస్తున్నారా? అని ప్రశ్నించారు. మూడు రాజధానులని తామసలు అనలేదని, ఇది గతంలో వాళ్లు చేసిన రికమెండేషన్ అని చెప్పుకొచ్చారు. ఈ రెండు వీడియోలను పోస్ట్ చేసిన లోకేశ్... 'భూకబ్జాల కోసమే రాజధాని మార్పు - ఈ అబద్ధపు నోట తన్నుకొచ్చిన నిజం' అని విమర్శించారు.

More Telugu News