science: కొత్త రకం దోమలను సృష్టించిన పరిశోధకులు!

  • అమెరికా శాస్త్రవేత్తల ఘనత
  • మానవ యాంటీబాడీలతో కూడిన దోమల సృష్టి
  • డెంగీ వైరస్ కు లొంగని విధంగా దోమల్లో జన్యుపరమైన మార్పులు
  • పరిశోధనలకు మరింత ఊతం ఇవ్వనున్న ఫలితాలు

డెంగీ వైరస్‌ నిలువెత్తు మనిషిని మంచం దిగనివ్వకుండా చేస్తుంది. ఈ ప్రాణాంతక డెంగీ వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, శాంటియాగో, వ్యాండర్‌బిల్ట్‌ వర్సిటీల శాస్త్రవేత్తలు.. కొత్త రకం దోమలను  సృష్టించారు.

మానవ యాంటీబాడీలతో కూడిన ఈ దోమలు జన్యు ఇంజినీరింగ్‌ విధానంలో సృష్టించబడ్డాయి. డెంగీ వైరస్ కు లొంగని విధంగా దోమల్లో జన్యుపరమైన మార్పులు(జీఎం) చేశారు. ఆడ ఏడిస్‌ ఏజిప్టి దోమల ద్వారా డెంగీ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. మనుషుల నుంచి సేకరించిన 'కార్గో' యాంటీబాడీని దోమల్లోకి పరిశోధకులు చొప్పించడంతో, వాటి శరీరంలో అది క్రియాశీలమై, డెంగీ వైరస్‌లు వృద్ధి చెందకుండా అడ్డుకట్ట వేస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు.

సాధారణంగా డెంగీ రోగులను దోమ కుట్టినప్పుడు, దానిలోకి డెంగీ వైరస్‌ ప్రవేశిస్తుంది. మళ్లీ అదే దోమ ఆరోగ్యవంతులైన వ్యక్తులను కుడితే వారికీ డెంగీ సోకుతుంది. ఇలా డెంగీ వ్యాప్తి చెందుతుంది. డెంగీ రోగులను దోమ కుట్టినప్పటికీ అది వైరస్‌ బారినపడకుండా ఉండగలిగేలా దోమల్లో మార్పులు చేయాలన్న ఆలోచనతో ఈ పరిశోధన చేశారు.

పరిశోధకులు సృష్టించిన కొత్త రకం దోమలు.. ఒకవేళ డెంగీ రోగుల రక్తాన్ని పీల్చితే, వాటిలోని మానవ యాంటీబాడీ క్రియాశీలకంగా మారి వైరస్‌ ప్రభావానికి లొంగకుండా రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఇతర వైరస్‌లను కూడా అడ్డుకునే దిశగా తమ ఈ పరిశోధన కీలకం కానుందని పరిశోధకులు తెలిపారు.

More Telugu News