Kamal Haasan: డీఎంకే-కాంగ్రెస్ పొత్తు పెటాకులవుతుందని ముందే చెప్పా: కమల్

  • పలు సభల్లో నేను ఇదే విషయాన్ని చెప్పా
  • రెండు పార్టీలు ప్రస్తుతం విడిపోయే ఆలోచనలో ఉన్నాయి
  • మక్కల్ నీదిమయ్యం చీఫ్ కీలక వ్యాఖ్యలు

డీఎంకే-కాంగ్రెస్ పొత్తుపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీదిమయ్యం అధినేత కమలహాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో కాంగ్రెస్-డీఎంకే పొత్తులో చీలిక తప్పదని తానెప్పుడో చెప్పానని, ప్రస్తుతం అదే జరిగిందని అన్నారు. నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో చెప్పినట్టుగానే ఇప్పుడు రెండు పార్టీల మధ్య మనస్పర్థలు వచ్చాయని, త్వరలోనే ఇవి విడిపోయే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.  అయితే, ఆ తర్వాత విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు కమల్ నిరాకరించారు.

డీఎంకే పొత్తు ధర్మం పాటించలేదని కాంగ్రెస్‌ నేతలు కేఎస్‌ అళగిరి, కేఆర్‌ రామస్వామి ఇటీవల విమర్శలు చేశారు. డీఎంకే అధినేత స్టాలిన్‌పైనా విమర్శలు చేయడంతో ఆ పార్టీ నేత దురైమురుగన్‌ మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు స్పందిస్తూ.. డీఎంకేపై తమకు అపారమైన గౌరవం ఉందని, కూటమి నుంచి విడిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News