Cricket: క్రికెట్‌లో విషాదం.. బంతి తగిలి బాలుడి మృతి!

  • కర్నూలు జిల్లా ఆదోనిలో ఘటన
  • స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు
  • బంతి ఛాతీకి తాకడంతో కుప్పకూలి మరణించిన వైనం

స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు బంతి తగిలి ప్రాణాలు కోల్పోయాడు. కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిందీ విషాదం. స్థానిక కార్వాన్‌పేటకు చెందిన మైనుద్దీన్ (12) ఆరో తరగతి చదువుతున్నాడు. తోటి మిత్రులతో కలిసి నిన్న సాయంత్రం క్రికెట్ ఆడుకునేందుకు మసీదుపుర మైదానానికి వెళ్లాడు. ఆట ముగిసిన తర్వాత మైదానంలో కూర్చుని సేద తీరుతున్నాడు.

ఈ క్రమంలో మరో బాలుడు కొట్టిన బంతి వేగంగా వచ్చి మైనుద్దీన్ ఛాతీ భాగంలో బలంగా తాకింది. బాలుడు కుప్పకూలిపోవడంతో మిగతా బాలురు హడలిపోయారు. గమనించిన స్థానికులు బాలుడికి నీళ్లు తాగించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్టు నిర్ధారించారు. కుమారుడు లేడన్న విషయం తెలిసి తల్లిదండ్రులు ఖాజా, షాహిదా బేగం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

More Telugu News