TRS: మా పార్టీ అభ్యర్థి నిజామాబాద్ మేయర్ కాకపోతే ముక్కు రాస్తా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా

  • స్థానిక కార్పొరేటరే.. మేయర్ అవుతారు
  • ఎంఐఎంకు ఆ పదవి ఇచ్చే ప్రసక్తే లేదు
  • తాము చేసిన అభివృద్ధి పనులను బీజేపీ మేనిఫెస్టోలో రాసుకుంది

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్‌ విమర్శలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా కౌంటరిచ్చారు. నగర మేయర్ గా తమ పార్టీ అభ్యర్థి ఎంపిక కాకపోతే.. తాను ప్రెస్‌క్లబ్ నుంచి కంటేశ్వర్ వరకు ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు. ఈ రోజు ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. అరవింద్ లా బాండ్ పేపర్లు రాసి మాట మార్చే అవసరం తనకు లేదన్నారు.

తాము చేసిన అభివృద్ధి పనులను బీజేపీ మేనిఫెస్టోలో రాసుకున్నారని  ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌ మేయర్‌ సీటును ఎంఐఎంకు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధమయ్యారని అరవింద్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. స్థానిక మేయర్ టీఆర్ఎస్ కార్పొరేటరే అవుతాడన్నారు. ఎంఐఎంకు ఆ పదవి ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. భైంసా అల్లర్లపై ఇక్కడ దీక్ష చేయడం ఏమిటంటూ అరవింద్ ను ప్రశ్నించారు.  అక్కడికే వెళ్లి దీక్షలు చేయాలని సూచించారు.

More Telugu News