Nirbhaya: నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి!

  • క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న ముఖేశ్ సింగ్
  • ఎక్కువ సమయం తీసుకోకుండానే పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి
  • షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న అమలుకానున్న ఉరిశిక్ష

నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. గత మంగళవారం ముఖేశ్ సింగ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ పిటిషన్ ను రాష్ట్రపతికి కేంద్ర హోంశాఖ పంపించింది. దీంతోపాటే, నిర్భయ దోషులు అత్యంత దారుణానికి పాల్పడ్డారని, వీరికి క్షమాభిక్ష పెట్టవద్దని రాష్ట్రపతిని కోరింది. ఈ నేపథ్యంలో, పిటిషన్ ను పరిశీలించిన రాష్ట్రపతి ఎక్కువ సమయం కూడా తీసుకోకుండానే పిటిషన్ ను తిరస్కరించారు.

క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించడంతో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కాబోతోంది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 22న ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉదయం 7 గంటలకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. అయితే, క్షమాభిక్ష పిటిషన్ నేపథ్యంలో అధికారులు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, 22న ఉరిశిక్ష అమలవుతుందా? లేక మరి కొన్ని రోజులు పడుతుందా? అనేది వేచి చూడాలి.

More Telugu News