BJP: ఆ రెండు పార్టీలకు గత ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో అందరికీ తెలుసు: అంబటి

  • బీజేపీ, జనసేన మైత్రిపై అంబటి వ్యాఖ్యలు
  • పెద్దగా స్పందించాల్సిన అవసరంలేదన్న అంబటి
  • కానీ తమకు కులతత్వం, కుటుంబపాలన, అవినీతి అంటగట్టారంటూ ఆగ్రహం

ఏపీలో తాజాగా ఏర్పడిన బీజేపీ, జనసేన కూటమిపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. ఏపీలో రెండు పార్టీలు చేయి కలపడం పట్ల పెద్దగా మాట్లాడాల్సిన అవసరంలేదన్నారు. రాజకీయాల్లో ఇది పరిపాటేనని అన్నారు. ఆ రెండు పార్టీలకు గత ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో, వాటికి లభించిన గుర్తింపు ఏమాత్రమో అందరికీ తెలుసన్నారు. వాస్తవానికి ఆ రెండు పార్టీల గురించి స్పందించాలని తాము భావించలేదని, కానీ, తమ వైసీపీ ప్రభుత్వ ఏడు నెలల పాలన విఫలమైందని వ్యాఖ్యలు చేయడంతో స్పందించక తప్పలేదని అన్నారు.

తమపై కులతత్వం, కుటుంబ పాలన, అవినీతి అంశాలను రుద్దడానికి ప్రయత్నించారని అంబటి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఐదేళ్లలో కుల, కుటుంబ పాలన, అవినీతికి పాల్పడ్డారంటే అది వేరే విషయం, కానీ తమ ప్రభుత్వ ఏడు మాసాల పాలనను తప్పుబట్టడంతోనే తాము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

More Telugu News