Sanjay Raut: కన్నెర్ర చేసిన కాంగ్రెస్.. వెనక్కి తగ్గిన సంజయ్ రౌత్

  • ముంబై డాన్ కరీంలాలాను కలిసేందుకు ఇందిర వచ్చేదంటూ వ్యాఖ్యలు
  • ఇందిర ఉక్కు మహిళ అంటూ సరిదిద్దుకున్న రౌత్
  • నెహ్రూ, గాంధీల కుటుంబంపై గౌరవం ఉందని వ్యాఖ్య

కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేయడంతో శివసేన నేత సంజయ్ రౌత్ వెనక్కి తగ్గారు. ఒకప్పటి ముంబై డాన్ కరీంలాలాను కలిసేందుకు ఇందిరాగాంధీ దక్షిణ ముంబైకి వచ్చేవారంటూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

మహారాష్ట్రలో కాంగ్రెస్ తో అధికారాన్ని పంచుకుంటున్న తరుణంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ నివ్వెరపోయారు. కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ ఆ వ్యాఖ్యల పట్ల ఆగ్రహంతో స్పందించడంతో దిగివచ్చిన సంజయ్ రౌత్ కవరింగ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. కరీంలాలాను కలుసుకునేందుకు ఎంతో మంది ప్రముఖులు ముంబైకి వచ్చేవారని చెబుతూ తన వ్యాఖ్యల తీవ్రతను కొంతమేర తగ్గించే ప్రయత్నం చేశారు.

ఫక్తూన్ ఇ హింద్ సంస్థకు పఠాన్ నేత అయిన కరీంలాలా నాయకత్వం వహించేవారని... తనకున్న పలుకుబడితో ఇందిరాగాంధీతో సహా చాలా మంది ముఖ్య నేతలను ఆయన కలుసుకునేవారని సంజయ్ రౌత్ చెప్పారు. ఇందిరాగాంధీ ఉక్కు మహిళ అని... ఇలా చెప్పేందుకు తాను సందేహించనని అన్నారు. నెహ్రూ, గాంధీల కుటుంబంపై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ముంబై చరిత్ర తెలియనివారు తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు.

More Telugu News