Pawan Kalyan: చెగువేర ఆదర్శమని చెప్పుకున్న పవన్ కల్యాణ్ చెంగువీర అయ్యారు: రామకృష్ణ

  • బీజేపీతో ఎందుకు కలుస్తున్నారో పవన్ చెప్పాలి
  • ఆయనకు నడ్డా బందరు లడ్డూలు ఇచ్చారా?
  • దమ్మున్నవాళ్లే బీజేపీని విమర్శించగలరు

ఏపీలో నిన్న మొన్నటివరకు మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, సీపీఐ పార్టీల మధ్య ఇప్పుడు అంతరం ఏర్పడింది. బీజేపీతో జనసేన చేతులు కలపడంతో సీపీఐ షాక్ కు గురైంది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ పై సీపీఐ నేత రామకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీతో ఎందుకు కలుస్తున్నారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి పత్యేక హోదా ఇస్తామని చెప్పి పాచిపోయిన లడ్డూలను ఇచ్చిందంటూ బీజేపీని గతంలో పవన్ విమర్శించారని... ఢిల్లీలో నడ్డాను కలిసిన తర్వాత పవన్ కు బందరు లడ్డూలు ఇచ్చారా? అని ప్రశ్నించారు.

ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్తున్న నేతలంతా జేఎన్యూకు వెళ్తున్నారని... కేవలం పవన్ మాత్రమే బీజేపీ ఆఫీసుకు వెళ్లారని రామకృష్ణ వ్యంగ్యంగా అన్నారు. చెగువేర తనకు ఆదర్శమని చెప్పుకున్న పవన్... ఇప్పుడు చెంగువీర అయ్యారని ఎద్దేవా చేశారు. కేవలం దమ్మున్నవారే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడగలరని ఆయన అన్నారు. మరి పవన్ కు దమ్ముందో, లేదో ఆయనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

More Telugu News