MS Dhoni: ధోనీ రావాల్సిందే... నినదిస్తున్న భారత క్రికెట్ ఫ్యాన్స్!

  • ఆసీస్ తో తొలి వన్డేలో ఘోర ఓటమి
  • గాయపడిన కీపర్ రిషబ్ పంత్
  • ధోనీని పిలవాలంటున్న అభిమానులు

ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘోర పరాభవం, ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడి, జట్టుకు దూరమైన నేపథ్యంలో, ఎంఎస్ ధోనీని వెంటనే పిలిపించాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. రెండో వన్డే పోరుకు రిషబ్ అందుబాటులో లేకపోవడంతో కీపర్ గా ధోనీ ఉండాల్సిందేనని, జట్టు బ్యాటింగ్ లైనప్ కూడా బలపడుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

కాగా, తొలి వన్డేలో ప్యాట్ కమ్మిన్స్ వేసిన 44వ ఓవర్‌ లో పంత్ హెల్మెట్‌ కు బంతి బలంగా తాకగా, ఆపై అతను ఫీల్డింగ్ చేయలేకపోయాడు. అతని స్థానంలో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేశాడన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఓటమి పాలైంది. ఆసీస్ జట్టు 10 వికెట్ల తేడాతో ఇండియాను మట్టి కరిపించగా, క్రికెట్ అభిమానులు తీవ్రంగా స్పందించారు.

తక్షణమే జట్టులోకి ధోనీని పిలవాలని, ఆసీస్ వంటి జట్టుతో ఆడుతున్నప్పుడు, జట్టు కూర్పు చాలా జాగ్రత్తగా చేయాల్సిన వేళ, అనుభవం లేని ఆటగాళ్లను దించారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఆసీస్ తో సీరీస్ విజయం సాధించాలంటే తప్పనిసరిగా ధోనీ వంటి ప్లేయర్ ఉండాల్సిందేనని అంటున్నారు. దీనిపై బీసీసీఐ గానీ, సెలక్షన్ టీమ్ మెంబర్లుగానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

More Telugu News