Karnataka: ఇలాగైతే చాలా కష్టం... రాజీనామా చేసేస్తా: యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు!

  • సీఎంగా ఉన్న నాపై ఎంతో ఒత్తిడి
  • పదవీ త్యాగం చేస్తానేతప్ప బెదిరింపులకు లొంగబోను
  • వచనానంద స్వామీజీ వ్యాఖ్యలపై యడ్డీ కౌంటర్

ఓ ముఖ్యమంత్రిగా తనపై ఎంతో ఒత్తిడి వుందని, తన పరిస్థితి బాగాలేదని, ఇలాగే ఉంటే రాజీనామా చేస్తానని కర్ణాటక సీఎం యడియూరప్ప వ్యాఖ్యానించారు. తాజాగా, హరిహరలో జరిగిన జాతర ఉత్సవంలో పాల్గొన్న ఆయన, వచనానంద స్వామీజీ పంచమశాలి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. పదవీ త్యాగం చేస్తానే తప్ప బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేశారు. మురుగేశ్ నిరాణీకి మంత్రి పదవి ఇవ్వాలని సూచించిన వచనానంద, అది జరుగకుంటే పంచమశాలీలంతా దూరమవుతారని హెచ్చరించారు.

ఆపై ఉన్న చోటు నుంచి ఒక్క ఉదుటన లేచిన యడియూరప్ప, తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. బీజేపీ కోసం 17 మంది రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. వారికి మంత్రి పదవులు ఇవ్వాల్సి వుందని చెప్పారు. వారి సహకారంతోనే ప్రభుత్వం ఏర్పడిందని, తనను టార్గెట్ చేస్తే, రిజైన్ చేసేస్తానని అన్నారు.

వచనానంద తన అభిప్రాయాన్ని చెవిలో చెప్పి ఉంటే బాగుండేదని, ఇలా బహిరంగ వేదికలపై మాట్లాడటం, ఓ వర్గం దూరమవుతుందని హెచ్చరించడం సరికాదని అన్నారు. స్వామిజీ పరిపాలనా సలహాలు ఇవ్వొచ్చుకానీ, మంత్రి పదవుల కోసం తనపై అజమాయిషీ చేయడం ఏంటని ప్రశ్నించారు. వీరిద్దరి వ్యాఖ్యలు ప్రస్తుతం కన్నడ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

More Telugu News