Chandrababu: నేను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పను: చంద్రబాబు

  • రాజధాని, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు 
  • ఈ ఏడాది కష్టాల సంక్రాంతి జరుపుకుంటున్నాం
  • రైతులకు మద్దతు ఇచ్చేందుకే మందడం వచ్చాం
  • అధైర్య పడి ఎవరూ ప్రాణ త్యాగాలు చేయొద్దు

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు మందడంలో ఆయన మాట్లాడుతూ... రాజధాని, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు అని అన్నారు. ఈ సారి తాను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పబోనని, ఈ ఏడాది కష్టాల సంక్రాంతి జరుపుకుంటున్నామని అన్నారు.

రైతులకు మద్దతు ఇచ్చేందుకే ఈ రోజు తమ కుటుంబ సభ్యులం మందడానికి వచ్చామని చంద్రబాబు చెప్పారు. రాజధాని అనేది ఐదు కోట్ల ఆంధ్రులకు సంబంధించిన విషయమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. గట్టిగా పోరాడి అమరావతి రాజధానిని సాధించుకుందామని చెప్పారు.

అధైర్య పడి ఎవరూ ప్రాణ త్యాగాలు చేయొద్దని చంద్రబాబు అన్నారు. అమరావతిలో తాను కట్టిన ఏసీ రూముల్లో ప్రభుత్వ నేతలు ఉంటున్నారని, మరోవైపు అమరావతిలో నిర్మాణాలే జరగలేదని అంటున్నారని అన్నారు. రాజధానిలో రైతు కూలీలకు పెన్షన్లు కూడా ఇచ్చామని చెప్పారు. నీళ్లు ఇస్తే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని, తాము రూ.65 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేశామని తెలిపారు.

More Telugu News