Municipal Elections: వైఎస్ అభిమానుల మెప్పు కోసం తంటాలు పడుతున్న కేసీఆర్: పొన్నాల

  • మునిసిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం ప్లాన్
  • అందుకే జగన్ ను కలిసిన కేసీఆర్
  • ఫేస్ బుక్ లైవ్ లో పొన్నాల లక్ష్మయ్య

తెలంగాణలో మునిసిపల్‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులను ఆకర్షించాలని, వారి ఓట్లను కొల్లగొట్టాలని కేసీఆర్ నానా తంటాలూ పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. అందుకే కేసీఆర్, జగన్ ను కలిశారని ఆరోపించారు. వారిద్దరి మధ్యా ఏఏ విషయాల్లో చర్చలు జరిగాయో బహిర్గతం చేయాలని పొన్నాల డిమాండ్ చేశారు. వారు బయటకు చెబుతున్నట్టు నదుల అనుసంధానం గురించే చర్చలు జరిగివుంటే, ఆ శాఖ కార్యదర్శులు ఎందుకు లేరని ప్రశ్నించారు.

ఫేస్ బుక్ లైవ్ ద్వారా మాట్లాడిన ఆయన, తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో కృష్ణా నది నుంచి రాయలసీమ ప్రాంతానికి పోతిరెడ్డి పాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తుంటే, తీవ్ర విమర్శలు చేసి, అడ్డుకున్న కేసీఆర్, ఇప్పుడు 88 వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళుతుంటే, ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు.

More Telugu News