Guntur District: గుంటూరు జిల్లాలో దారుణం.. సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన యువతి

  • శుభకార్యంలో యువతికి మాయమాటలు
  • మద్యం తాగించి సామూహిక అత్యాచారం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ముగ్గురు యువకుల చేతిలో అత్యాచారానికి గురైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మండలానికి చెందిన ఓ యువతి (21) గత నెల 24న మండలంలోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరైంది. కార్యక్రమం పూర్తైన తర్వాత పరిచయస్తులైన ముగ్గురు వ్యక్తులు ఆమెకు మాయమాటలు చెప్పి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.
 
అక్కడామెకు మద్యం తాగించి ముగ్గురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బంధువుల ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాధిత యువతి నీరసంగా ఉండడంతో ఆందోళన చెందిన బంధువులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారొచ్చి యువతిని మాచర్లలోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిన్న ఆమె ప్రాణాలు విడిచింది.

యువతి శరీరంపై గాయాలను చూసి అనుమానించిన కుటుంబ సభ్యులు ఫంక్షన్‌లో ఏం జరిగిందో ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులనూ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

More Telugu News