polavaram: పోలవరంపై తాజా నివేదిక సమర్పించాలంటూ ఏపీకి సుప్రీం ఆదేశాలు

  • ఒడిశా, తెలంగాణ అభ్యంతరాలపై రెండు వారాల్లోగా స్పందించాలి
  • తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా
  • బచావత్ అవార్డుకు వ్యతిరేకంగా డిజైన్ మార్చారన్న ఒడిశా
  • గిరిజనులకు ముంపు లేకుండా చూడాలన్న తెలంగాణ

పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. బచావత్ అవార్డుకు భిన్నంగా ప్రాజెక్టు డిజైన్ ను మార్చారని ఒడిశా వాదిస్తూ.. ప్రాజెక్టు ముంపుపై కనీసం అధ్యయనం కూడా చేయలేదని తెలిపింది. మరోవైపు ప్రాజెక్టుపై తమకు అభ్యంతరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం మణుగూరు ప్లాంట్, గిరిజనులకు ముంపు లేకుండా చూడాలని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ.. ప్రాజెక్టు ఎప్పటిలాగే కొనసాగుతుందని, మార్పులు లేవని కోర్టుకు వెల్లడించారు. సుప్రీంకోర్టు తన ఆదేశాలను జారీచేస్తూ.. పోలవరం ప్రభావిత రాష్ట్రాల అభ్యంతరాలు, సందేహాలు దూరంచేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపైన ఉందని పేర్కొంది. పూర్తి వివరాలతో ప్రాజెక్టు తాజా నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఇందుకు రెండు వారాల గడువును కోర్టు నిర్దేశించింది. అదేవిధంగా విచారణను కూడా రెండు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

More Telugu News