Pakistan: లండన్‌ రెస్టారెంటులో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. ఫొటో వైరల్‌.. ఆయన అనారోగ్యంపై సందేహాలు

  • మనీలాండరింగ్‌ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటోన్న షరీఫ్‌
  • ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమమంటూ ప్రచారం 
  • బెయిల్ ఇచ్చిన లాహోర్ కోర్టు 
  • చికిత్స కోసం లండన్‌ వెళ్లిన షరీఫ్

మనీలాండరింగ్‌తో పాటు పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటోన్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఎన్నో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోతున్నాయని, మెరుగైన వైద్యం కోసం లండన్ వెళ్లాలని వైద్యులు సూచించారని ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ వేయడంతో లాహోర్ కోర్టు ఇటీవల ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

దీంతో ఆయన లండన్ వెళ్లిపోయారు. గతేడాది నవంబరు నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. ఆయనకు ఇచ్చిన నాలుగు వారాల బెయిల్ గడువు ముగియడంతో ఈ గడువును పొడిగించాలని ఆయన దరఖాస్తు చేసుకున్నారు. మంచం దిగే పరిస్థితిలోనూ నవాజ్ షరీఫ్ లేడని అందరూ భావిస్తోన్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చి వైరల్ అవుతోంది.

ఓ రెస్టారెంటులో నవాజ్ షరీఫ్ హాయిగా కూర్చొని కొందరికి ముచ్చట్లు చెబుతున్నట్లు అందులో ఉంది. దీంతో ఆయన నిజంగానే అనారోగ్యంతో బాధపడుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయనకు బెయిల్ గడువు పొడిగించే అవకాశం లేదని ఊహాగానాలు వస్తున్నాయి.

లండన్‌లోని రెస్టారెంటులో షరీఫ్.. పీఎంఎల్ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్, అతడి కుమారుడు హంజాలతో కలిసి కూర్చొని ఉన్నట్లు ఈ ఫొటోలో స్పష్టంగా కనపడుతోంది. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు కూడా స్పష్టమవుతోంది. ఈ ఫొటో పాక్‌లో తీవ్ర చర్చనీయాశంగా మారింది.

పాక్ అధికార పాకిస్థాన్ తెహ్రీక్ ఐ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేతలు నవాజ్ షరీఫ్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఫొటోపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ కూడా తమ నేతలతో చర్చించారు. ఈ ఫొటోపై పీఎంఎల్ఎన్ నేతలు స్పందిస్తూ.. అనారోగ్యంతో బాధపడుతోన్న నవాజ్ షరీఫ్‌ చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పు ఉండాలని, పలు ప్రాంతాల్లో ఆయనను తిప్పాలని సూచించినట్లు తెలిపారు. గదిలోంచి బయటకు వెళ్లకపోతే ఆరోగ్యానికి మంచిదికాదని చెప్పినట్లు తెలిపారు. అందుకే, తన కుటుంబ సభ్యులతో ఫ్రెష్ గాలి కోసం నవాజ్ షరీఫ్ వాకింగ్‌కు వెళ్లి రెస్టారెంటులో టీ తాగారని అన్నారు.

More Telugu News