Pawan Kalyan: విశాఖ నుంచి కాకినాడకు బయల్దేరిన పవన్ కల్యాణ్.. ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటి వద్ద భారీ భద్రత

  • ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్
  • భారీ కాన్వాయ్ మధ్య కాకినాడకు పయనం
  • కాకినాడలో సెక్షన్ 144

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపటి క్రితం ఢిల్లీ నుంచి విశాఖపట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు జనసైనికులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో కాకినాడకు బయల్దేరారు.

భారీ కాన్వాయ్ మధ్య ఆయన ప్రయాణం కొనసాగుతోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన కాకినాడ చేరుకోనున్నారు. కాకినాడలో 2 నుంచి 4 గంటల వరకు ఆయన కార్యక్రమం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో, నగరంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను కూడా రంగంలోకి దించారు.  

పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ ప్రాంతంలో పికెటింగ్ ను ఏర్పాటు చేయడమే కాకుండా, పరిసర ప్రాంతంలోని షాపులను కూడా బంద్ చేయిస్తున్నారు. ఈ ప్రాంతానికి వచ్చేవారి వివరాలను సేకరిస్తున్నారు. పవన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆదివారం నాడు ద్వారంపూడి నివాసాన్ని ముట్టడించేందుకు జనసేన కార్యకర్తలు యత్నించిన సంగతి తెలిసిందే.

More Telugu News