Avanthi Srinivas: భవిష్యత్తే లేని చంద్రబాబుకు నేను కౌంటర్ ఇచ్చేదేంటి?: ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్

  • ముందు నారాయణ నివేదికలను చంద్రబాబు తగులబెట్టాలి
  • రాష్ట్రంలో ప్రజలు, రైతులు సంతోషంగా ఉన్నారు
  • విశాఖ సంక్రాంతి వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాస్

ప్రజలు వద్దనుకున్న తెలుగుదేశం పార్టీకి, దాని అధినేతగా చెప్పుకునే చంద్రబాబునాయుడు చేసే విమర్శలకు తాను కౌంటర్ ఇచ్చేదేంటని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విశాఖపట్నం మురళీనగర్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలోని ప్రజలు, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రతి కుటుంబానికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఈ సంక్రాంతి పర్వదినాలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటుంటే, చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని నిప్పులు చెరిగారు.

టీడీపీకి, చంద్రబాబుకు భవిష్యత్తే లేదని వ్యాఖ్యానించిన అవంతి శ్రీనివాస్, జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను తగులబెట్టే ముందు ఆయన నారాయణ కమిటీ నివేదికను తగులబెట్టాల్సిందని సలహా ఇచ్చారు. ఆ తరువాత మిగతా నివేదికల గురించి ఆలోచిస్తే బాగుండేదని అన్నారు. తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు, రాష్ట్రానికీ ఏమీ చేయని చంద్రబాబు, తన ఆస్తులను, తన బినామీల ఆస్తులను మాత్రం పెంచుకున్నారని మండిపడ్డారు.

More Telugu News