Roja: ఎవ్వరూ జగన్ ను అడ్డుకోలేరు: రోజా

  • రాజధాని మార్పును ఎవరూ ఆపలేరు
  • అధికారంలోకి వచ్చాక సంబరంగా తొలి సంక్రాంతి
  • చంద్రబాబులో తప్ప అందరిలో సంతోషమేనన్న రోజా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టీడీపీ, బీజేపీ, జనసేన వంటి పార్టీలు అడ్డుకోలేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ఈ ఉదయం నగరిలో మీడియాతో మాట్లాడిన ఆమె, తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని మార్పును ఏ పార్టీ కూడా ఆపలేదని ఆమె అన్నారు. గడచిన పదేళ్లుగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని, అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సంక్రాంతిని సంబరంగా జరుపుకుంటున్నామని తెలిపారు.

పండగకు దూరంగా చంద్రబాబు ఉండటమన్నది ఓ నాటకమని, తన స్వగ్రామం నారా వారి పల్లెకు ఏమీ చేయలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. 2020లో చంద్రబాబు తప్ప, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ భోగి మంటల్లో చెడు ఆలోచనలు ఉన్నవాళ్లనీ, చెడును తగులబెట్టేస్తున్నామని ఆమె అన్నారు. ఇకపై కొత్త సంతోషాలు, కొత్త ఆశయాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉంటారని రోజా అభిప్రాయపడ్డారు. 

More Telugu News